1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఎన్‌సీఆర్ పరిధిలోని 14 జిల్లాల్లో బాణాసంచా విక్రయాలపై నిషేధం

హర్యానా రాష్ట్రంలోని నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌(ఎన్.సి.ఆర్) పరిధిలోకి వచ్చే 14 జిల్లాల్లో బాణాసంచా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. టపాకాయల అమ్మకాలు, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. 
 
పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, కేవలం గ్రీన్‌ క్రాకర్స్‌ వినియోగానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. వాటిని కాల్చేందుకు కూడా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సమయాన్ని నిర్దేశించింది. 
 
దీపావళి పండుగ రోజున కేవలం రెండు గంటలను మాత్రమే గ్రీన్‌ క్రాకర్స్‌ను కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. దీపావళి పండుగ రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు, ఛట్‌ పూజ సందర్భంగా ఉదయం 6-8 గంటల వరకు, క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా రాత్రి 11.55-12.30 పటాకులు పేల్చేందుకు అనుమతి ఇచ్చింది.
 
కాగా, ప్రభుత్వ నిషేధ ఆంక్షలను ఉల్లంఘించి ఎవరైనా టపాకాయలను విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా, పోలీసు బృందాలు తనిఖీలు చేపడుతాయని హెచ్చరించింది. 
 
శీతాకాలం, కరోనా మహమ్మారి నేపథ్యంలో పటాకులు పేల్చడం ద్వారా వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో బ్యాన్‌ విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. 
 
ఈ నిషేధం భివానీ చర్కీ, దాద్రీ, ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, ఝజ్జర్‌, జింద్‌, కర్నాల్‌, మహేంద్రగఢ్‌, నూహ్‌, పల్వల్‌, పానిపట్‌, రోహ్తక్‌, రేవారి, సోనెపట్‌లో నిషేధం అమలులో ఉండనున్నది. మరో వైపు పంజాబ్‌లోనూ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.