గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (10:50 IST)

14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి... బతికుండగానే..?

మధ్యప్రదేశ్‌లో రోజు రోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల 13 ఏళ్ల బాలికపై 9 మంది రెండు రోజుల పాటు జరిపిన అత్యాచార కాండ మరిచిపోకముందే మరో రెండు సంఘటనలు వెలుగు చూశాయి. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి... బతికుండగానే పూడ్చిన ఘటన బేతుల్‌లో బయటపడింది. అయితే ఆ బాలికను కుటుంబ సభ్యులు రక్షించారు. అదేవిధంగా ఇండోర్‌లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిపి..ఆపై కత్తితో పొడిచి...సంచిలో వేసి రైల్వేట్రాక్‌పై పడేశారు. ఆమె కూడా ప్రాణాలతో బయటపడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. బేతుల్‌లోని గ్రామంలోని తన పొలంలో ఉన్న మోటారు కట్టేందుకు వెళ్లిన బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అనంతరం ఓ కాలువలో పడవేసి..రాళ్లతో బతికుండగానే కప్పేందుకు ప్రయత్నించాడు. ఎంతకూ బాలిక రాకపోవడంతో...గాలించిన తల్లిదండ్రులకు కాలువలో మూలుగుతుండగా...రాళ్ల కింద కనిపించడంతో బయటకు తీశారు. ఈ ఘటనలో 35 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి..ఐపిసిలోని పలు సెక్షన్‌లతో పాటు ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
 
ఇండోర్‌లో 19 ఏళ్ల యువతిని ఆమె మాజీ ప్రేమికుడు మాయమాటలు చెప్పి నందిగ్రామ్‌లోని ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారం జరిపాడు. ప్రతి ఘటించడంతో ఆమెను కత్తితో పొడిచి..సంచిలో వేసి..భగీరత్పురలోని రైల్వే ట్రాక్‌పై పడేశారు. అయితే ఆమె తప్పించుకుని బయటకు రాగా..స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్చారని పోలీసులు తెలిపారు. 
 
తాను కోచింగ్‌ సెంటర్‌కు వెళుతుండగా.. ప్రధాన నిందితుడు , అతడి స్నేహితుడు కలిసి తనను మోటారు వాహనంపైకి బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నట్లు తెలిపారు. ఒక నిందితుడ్ని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు సమ్మాన్‌ పేరిట ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని 15 రోజులు చేపట్టేందుకు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం పూనుకున్న ఈ సమయంలో ఈ అఘాయిత్యాలు చోటుచేసుకోవడం గమనార్హం.