గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (18:41 IST)

కలికాలం అంటే ఇదే.... రాముడి కంటే మోడీ ఎక్కువయ్యారు..

కలికాలం అంటే ఇదే.. ఇపుడు రాముడు కంటే నరేంద్ర మోడీ ఎక్కువయ్యారు అంటూ సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆమె బుధవారం ఓ ట్వీట్ చేశారు. 
 
బుధవారం అయోధ్యపురిలో భవ్య రామాలయ నిర్మాణం కోసం భూమిపూజ జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోడీపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దశాబ్దాల కలను మోడీ నెరవేర్చారని ప్రశంసిస్తున్నారు.
 
ఈ పరిస్థితుల్లో కర్ణాటక బీజేపీ ఎంపీ సదానందగౌడ బుధవారం ట్వీట్ చేస్తూ... తన ప్రియతమ రాజు మోడీని తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ట్వీట్‌ను సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ షేర్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాముడి కంటే మోడీ ఎక్కువయ్యాడని... కలికాలం అంటే ఇదేనని విమర్శించారు.
 
కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పిస్తే ఖుష్బూ మాత్రం స్వాగతించారు. 
 
'నూతన విద్యా విధానంపై పార్టీ విధానంతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఇందుకు రాహుల్ గాంధీగారూ... నన్ను క్షమించాలి. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. నేను రోబోను కాను. కీలు బొమ్మను అసలే కాను. ప్రతి విషయంలోనూ అధిష్టానానికి తలూపాల్సిన పని లేదు. ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలి' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.