శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (10:13 IST)

హర్యానాలో లాక్డౌన్.. ఉత్తరాఖండ్‌లో 11 నుంచి కర్ఫ్యూ

హర్యానా రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్‌ను పొడగిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. ఈ నెల 17 వరకు లాక్డౌన్‌ అమలులో ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. 
 
హర్యానాలో ఆదివారం కరోనాతో 151 మంది మరణించగా.. మొత్తం మరణాలు 5,506కు పెరిగాయి. కొత్తగా 13,548 కరోనా కేసులు నమోదవగా.. మొత్తం 6,15,897కు చేరాయి. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నెల 3న లాక్డౌన్‌ ప్రకటించింది. అయినా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
మరవైపు దేశాన్ని కరోనా వణికిస్తోంది. మహమ్మారి ఉధృతికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్‌ బాట పట్టగా.. మరిన్ని పాక్షిక లాక్డౌన్‌ అమలు చేస్తున్నాయి. మరోకొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. పెరుగుతూ వస్తున్న కేసుల మధ్య ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొంది. 
 
మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్‌ మంత్రి సుబోధ్‌ యునియల్‌ తెలిపారు. కర్ఫ్యూ సమయంలో పాలు, కూరగాయలు, పండ్లు, మాంసం తదితర అత్యవసర దుకాణాలను ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 
కిరాణ దుకాణాలు ఈ నెల 13న తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్‌ కాంప్లెక్స్‌, జిమ్‌లు, థియేటర్లు, అసెంబ్లీ హాళ్లు, మద్యం దుకాణాలు, బార్లు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మూసే ఉంటాయని తెలిపింది. కర్ఫ్యూ సమయంలో ఐడీకార్డులు ఉన్న మీడియా వ్యక్తులకు బయట తిరిగేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
అంతర్‌రాష్ట్ర ప్రయాణికులు తప్పనిసరిగా 72 గంటలకు మించకుండా ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే డెహ్రాడూన్‌ పరిపాలన పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉత్తరాఖండ్‌ ప్రజలు వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.