తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని తెరాసను బీఆర్ఎస్ చేసారు?: కవిత ఆవేదన, ఆగ్రహం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం నాడు శాసనమండలిలో సంచలన వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఏనాడు నాకు మద్దతుగా నిలబడలేదు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో బీఆర్ఎస్ ఏమీ చేయలేదు. తెలంగాణ ఏర్పాటుకు నాకున్న పరిచయంతో ఆస్కార్ ఫెర్నాండెజ్తో కేసీఆర్కు ప్రత్యేక సమావేశం జరిపించాను. ఆ తర్వాతే సోనియా గాంధీ ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందడుగు పడింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనంపైన చర్చ సాగినా విలీనం జరగలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ స్వతంత్రంగా పోటీ చేయడం, విజయం సాధించడం జరిగింది. నేను నిజామాబాద్ ఎంపి టిక్కెట్టుకు పోటీ చేస్తే ఆ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలు గెలుస్తారని చేయించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నేను నిర్వహించిన బతుకమ్మ పండుగకు అడ్డు తగిలారు.
అలా నాకు అడుగడుగునా అడ్డు తగులుతూనే వున్నారు. ఐనా అవన్నీ భరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నాను. తెరాస పేరును బీఆర్ఎస్ గా మార్చడానికి తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని మార్చాలి. నేను పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకించాను. ఐనా పార్టీ పేరు మార్చారు. ఇది ఒక్కటే కాదు అనేక రంగాల్లో బీఆర్ఎస్ ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమైందంటూ ఆరోపించారు.