1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (20:48 IST)

అతనో టీచర్, ఇప్పుడు దొంగల ముఠా నాయకుడు

ఇతనో పాఠాలు చేప్పే మాస్టారు.. ప్లాన్ వేస్తే ఇల్లు గుల్లే.. ఒకప్పుడు అతనో ఉపాధ్యాయుడు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పేవాడు. కానీ నేడు దారి తప్పి దొంగల ముఠా నాయకుడయ్యాడు. చోర కళలలో ప్రావీణ్యం సంపాదించి ముఠా సభ్యులకు దొంగతనం ఎలా చేయాలో పాఠాలు నేర్పుతున్నాడు.
 
వివరాలు పరిశీలిస్తే కోసూరి శ్రీనివాసరావు కల్వకర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాల్లో ఇంగ్లీష్ బోధించేవాడు. ఎన్నాళ్లు పాఠాలు చెప్పినా, జీతం తప్ప పెద్దగా ప్రయోజనం లేదు, ఇలా అయితే సంపన్నుడు కావాలన్న కల నెరవేరదు? అనుకుని ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లి పోలీసులకు దొరికిపోయాడు. చోరీ కేసులో జైలుకెళ్లిన శ్రీనివాస్ అక్కడో మాస్టర్ ప్లాన్ వేశాడు. 
 
జైల్లో పరిచయమైన ఖైదీలతో గ్యాంగును ఏర్పాటు చేసి వాళ్లతో దొంగతనాలు చేయించాలనేది అతని స్కెచ్. శ్రీనివాస్ బెయిల్ పైన బయటకు వచ్చిన తరువాత జైల్లో ఉన్న తోటి ఖైదీలను బెయిళ్లపై బయటికి తెచ్చేందుకు వారికి అవసరమైన న్యాయవాదిని ఏర్పాటు చేసి, కోర్టుకు ష్యూరిటీలను ఇచ్చి విడుదల చేయించేవాడు. అలా జైళ్ల నుంచి విడుదల ఖైదీల నుంచి లాయర్ ఫీజు డబ్బును వసూలు చేసుకోవడానికి దొంగతనాలు చేయించేవాడు.
 
బయటకు వచ్చిన ఖైదీలకు రూమ్‌లు, ఇళ్లను అద్దెలకు ఇప్పించాక చోరీకి అవసరమైన స్క్రూ డ్రైవర్లు, ఇనుప రాడ్లను ఇతర పరికరాలిచ్చేవాడు. చోరీ చేసొచ్చాక బంగారు, వెండి నగలను అమ్మి పర్సంటేజ్లను తీసుకునేవాడు టీచర్ శ్రీనివాసరావు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పటివరకు 48 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఈ టీచర్ శ్రీనివాసరావు.
 
తెలంగాణలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌తో పాటు మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌తో పాటు.. ఏపీలోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసి.. వారి నుండి పదిహేడున్నర తులాల బంగారు నగలు, 300 తులాల వెండి ఆభరణాలు, 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.