మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:50 IST)

ఒకే దేశం - ఒక విద్యా విధానం .. మాతృభాషలో బోధనే బెస్ట్ : ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విద్యావిధానం పట్ల చాలా మంది విద్యావంతులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఈ విద్యా విధానంతో విద్యావ్యవస్థ రూపు రేఖలు మారిపోతాయని ప్రధానమంత్ర నరేంద్ర మోడీ సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
శుక్రవారం కొత్త విద్యా విధానంపై ఆయన స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విద్యా విధానంతో విద్యా వ్యవస్థ రూపు రేఖలు మారిపోతాయన్నారు. విస్తృతమైన అధ్యయనం తర్వాతే ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ విద్యా విధానంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగాలని కోరారు. 
 
కొత్త విధానంతో పిల్లలపై పుస్తకాల భారం తగ్గుతుందని... ఇదేసమయంలో చదువుకోవాలన్న కోరిక వారిలో పెరుగుతుందన్నారు. పిల్లల్లో ఆలోచనా శక్తిని, సునిశిత పరిశీలనను పెంచేలా విద్యా విధానం ఉంటుందని తెలిపారు. తమ లక్ష్యాలకు విద్యార్థులు చేరుకునేలా ఉపకరిస్తుందని చెప్పారు. 
 
నర్సరీ నుంచి పీజీ వరకు సమూలమైన మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. ఒకే దేశం - ఒకే విద్యా విధానం ఉండాలనేదే జాతీయ విద్యా విధానం లక్ష్యమని చెప్పారు. కొత్త విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని మోడీ పిలుపునిచ్చారు. 
 
ఈ విధానం విద్యార్థుల నైపుణ్యాలపై దృష్టి పెడుతుందని చెప్పారు. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలని అన్నారు. కొత్త విద్యా విధానంపై ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. కొత్త విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు. 

ముఖ్యంగా, సరికొత్త విద్యావిధానం ద్వారా విద్యార్థులు ప్రపంచ పౌరులుగా రూపుదిద్దుకుంటారని తెలిపారు. పిల్లలకు మాతృభాషలో బోధించాల్సిన అవసరం ఎంతో ఉందని, పిల్లలు ఏ భాషలో మాట్లాడతారో, ఆ భాషలోనే త్వరగా నేర్చుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో మరో వాదనకు తావులేదని అన్నారు. తాము ఎన్ఈపీ-2020 తీసుకురావడానికి ప్రధాన కారణం ఇదేనని వెల్లడించారు.
 
కనీసం 5వ తరగతి వరకైనా మాతృభాషలో బోధన అవసరమని గుర్తించామని, అందుకే ఈ అంశానికి ఎన్ఈపీ-2020లో ప్రముఖ స్థానం కల్పించామని మోడీ చెప్పారు. వినూత్న జాతీయ విద్యావిధానం నూతన ప్రపంచంలోకి విద్యార్థులను నడిపిస్తుందని, అంతేకాకుండా 21వ శతాబ్దంలోకి కొత్త భారతావనికి పునాది వేస్తుందని ఆకాంక్షించారు. 
 
తాము తీసుకువచ్చిన ఈ భావి విద్యావిధానానికి ఎక్కడా నిరసనలు వ్యక్తం కాలేదని, దీనిపై ఆరోపణలు కూడా రాలేదని, ఇది ఎంతో సంతోషదాయకం అని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు సాగించిన మేధోమథనం తర్వాత ఎన్ఈపీ-2020కి తుదిరూపకల్పన చేశామని వెల్లడించారు.