శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (10:07 IST)

కర్నాటకలో రాష్ట్రపతి పాలన? నివేదిక ఇచ్చిన గవర్నర్?

రాజకీయ అనిశ్చితి నెలకొన్న కర్నాటక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ఓ నివేదికను సమర్పించారు. దీంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
 
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్ సారథ్యంలోని సంకీర్ణ సర్కారు కొలువైవుంది. ఈ ప్రభుత్వానికి మద్దతూ వచ్చిన ఎమ్మెల్యేల్లో 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అదేసమయంలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కుమార స్వామి, కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే సంకీర్ణ పార్టీల బలం 104కు పడిపోనుంది. ఇలా శాసనసభలో బలం లేని ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు వీలు లేదనే డిమాండ్‌తో రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే ఎత్తుగడ సాగుతున్నట్టు తెలుస్తోంది. 
 
సభలో 224 మంది శాసనసభ్యులు ఉండగా కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, ఇరువురు స్వతంత్రులు, ఒక బీఎస్పీ ఎమ్మెల్యేతో కలసి 118 మంది బలంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. వీరికి స్పీకర్‌ బలం కూడా ఉంటుంది. 
 
అయితే, ప్రస్తుతం కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు చెందిన 14మంది రాజీనామాలు, ఇరువురు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో మెజారిటీ కుప్పకూలింది. బీజేపీకి 107మంది మద్దతు ఉండడంతో శాసనసభలో ప్రభుత్వం మైనారిటీలో పడినట్టు అయ్యింది. బలం ఉండే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలనే సుప్రీం తీర్పుకు అనుగుణంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.