ఈ గ్రామాల్లో కోడళ్లు, అవివాహిత యువతులకు కెమేరా వున్న ఫోన్లు నిషేధం
స్మార్ట్ ఫోన్ల కారణంగా ప్రపంచమే ఓ చిన్న గ్రామంగా మారిపోయిన ఈ రోజుల్లో రాజస్థాన్ లోని 15 గ్రామ పంచాయతీలు మహిళలు స్మార్ట్ ఫోన్లు.. అంటే కెమేరాతో వున్న ఫోన్లు ఉపయోగించకూడదంటూ ఓ నిషేధం విధించాయి. ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి కెమేరాతో కూడి వున్న స్మార్ట్ ఫోన్లను ఆ 15 గ్రామాల్లో వుండే కోడళ్లు, పెళ్లికాని యువతులు వాడరాదంటూ నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. పక్కింటికో, పెళ్లి-పేరంటాళ్లకు వెళ్లి ఫోటోలు తీసుకునేందుకు సైతం ఫోన్లను అనుమతించరు.
కేవలం చదువుకునే అమ్మాయిలకు మాత్రమే కెమేరా ఫోన్లు ఇస్తారు. అది కూడా వారు ఆ ఫోన్లను ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి. పాఠశాల లేదా కళాశాలకు తీసుకెళ్లేందుకు అనుమతించరు. ఈ మేరకు 15 గ్రామ పంచాయతీలకు చెందిన పెద్దలు తీర్మానించారు. ఐతే కెమేరా ఫోన్లకు బదులు బటన్ ఫోన్లను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఇలా యువతులపై నిషేధం ఎందుకు అని అడిగితే... పొద్దస్తమానం ఫోన్లు చూస్తూ కంటి దృష్టిని కోల్పోతున్నారనీ, మరీ ముఖ్యంగా యువతులు పొద్దస్తమానం ఫోనుకి అతుక్కుని వుంటున్నారని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.