ఐసీసీ టీ20 వరల్డ్ కప్ - ఆతిథ్య శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో మరో సంచలనం నమోదైంది. ఆతిథ్య దేశాల్లో ఒకటైన శ్రీలంకు పర్యాటక జింబాబ్వే జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ టోర్నీలో తొలుత ఆస్ట్రేలియాను చిత్తు చేసిన జింబాబ్వే గురువారం లంకేయులను మట్టికరిపించారు. ఈ టోర్నీ చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో జింబాబ్వే జట్టు విజయం భేరీ మోగించింది.
ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. పాథున్ నిశాంక (62) హాఫ్ సెంచరీ సాధించడంతో.. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పవన్ రత్నాయకే (44), కుశాల్ పెరీరా (22) రాణించారు. కుశాల్ మెండిస్ (14), కమిందు మెండిస్ (7), డాసున్ శనక (6) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, గ్రీన్ క్రెమెర్ 2, ఇవాన్స్ 2, బర్ల్ ఒక వికెట్ తీశారు.
అనంతరం జింబాబ్వే బ్యాటింగ్ ప్రారంభించింది. 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. మూడో వికెట్కు వీరిద్దరూ కలిసి 40 బంతుల్లోనే 69 పరుగులను జోడించారు. బ్రియాన్ బెనెట్ (63 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించగా.. సికందర్ రజా (45) దూకుడుగా ఆడేశాడు. 19వ ఓవర్లో హేమంత రెండు వికెట్లు తీసి జింబాబ్వేను కాస్త భయపెట్టాడు. అయితే, బెనెట్తో కలిసి మున్యాంగా (8 నాటౌట్) విజయతీరాలకు చేర్చాడు. శ్రీలంక బౌలర్లలో హేమంత 2.. వెల్లలాగే, శనక చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో జింబాబ్వే జట్టు గ్రూపు-బిలో అగ్రస్థానంలో నిలిచింది.