శనివారం, 30 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (10:15 IST)

ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.12 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ నిర్వాహకులు 12 లక్షల రూపాయల అపరాధం విధించారు. దీనికి కారణం స్లో ఓవర్ రేట్. ఐపీఎల్ టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో 11వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని చవిచూసింది. హైదరాబాద్ బౌలర్ రషీద్ ఖాన్ స్పిన్ బౌలింగ్ ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. 
 
దీనికితోడు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ రూ.12 లక్షల జరిమానా విధించింది. కనీస ఓవర్ రేట్ తప్పిదం కారణంగా ఐపీఎల్ నియమావళి కింద అయ్యర్‌కు జరిమానా విధించినట్టు పేర్కొంది. స్లో ఓవర్ రేట్‌కు ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న రెండో జట్టు జట్టు ఢిల్లీనే. ఇటీవల బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఇదే తరహా అపరాధం విధించిన విషయం తెల్సిందే. 
 
హైదరాబాద్ వికెట్లు పడగొట్టేందుకు ఢిల్లీ కెప్టెన్ అయిన శ్రేయాస్ బౌలింగ్‌లో పలు మార్పులు చేశాడు. బౌలర్లతో చర్చలు జరిపాడు. ఈ క్రమంలో నిర్దేశిత సమయంలో బౌలింగ్ కోటాను జట్టు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి కింద జరిమానా విధించారు. కాగా, హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ తొలి ఓటమిని నమోదు చేసింది.